నాపై, పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. హరీష్‌రావు

కవిత కూడా అలాంటి కామెంట్లనే తనమీద చేశారని విమర్శ

 ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి హరీష్‌రావు.

 

హైదరాబాద్: తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన నిబద్ధత అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేయాల్సిన బాధ్యత తనపై ఉందని నొక్కిచెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో ఓ కార్యకర్తలాగా తాను పాతికేళ్లు పనిచేశానని వ్యాఖ్యానించారు. తనపై, పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. తనపై దిగజారుడు రాజకీయాలు మంచిది కాదని హితవు పలికారు మాజీ మంత్రి హరీష్‌రావు.

 

లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు హరీష్‌రావు ఇవాళ(శనివారం) ఉదయం చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. తమ వ్యతిరేక పార్టీలు మామీద ఎలాంటి కామెంట్లు చేశాయో… కవిత కూడా అలాంటి కామెంట్లనే తనమీద చేశారని విమర్శించారు. కవిత ఎందుకు అలాంటి కామెంట్లు చేశారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఎరువుల కొరత, వరద ప్రభావం తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దశాబ్ద కాలం కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా కూల్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఆదుకునే విషయంలో.. తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం తాను బాధ్యతగా పనిచేస్తున్నానని ఉద్ఘాటించారు. తమ నాయకుడు కేసీఆర్ ఆధ్వర్యంలో కష్టాల్లో ఉన్న ప్రజలను రాష్ట్రాన్ని కాపాడుకోవటమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని హరీష్‌రావు పేర్కొన్నారు.

 

ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి హరీష్‌రావు..

 

అయితే, ఎర్రవల్లిలోని‌ కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి మాజీమంత్రి హరీష్‌రావు వెళ్లనున్నారు. లండన్ నుంచి తెల్లవారుజామున హైదరాబాద్‌కు ఆయన చేరుకున్నారు. తనపై కవిత చేసిన ఆరోపణలకు హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్‌‌లతో నేడు సమావేశం కానున్నారు హరీష్‌రావు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, కవిత ఎపిసోడ్‌పై చర్చించే అవకాశాలు ఉన్నాయి. గత ఆరు రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే కేటీఆర్ ఉన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram