గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న హాస్టల్ వసతి భవనాన్ని పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆర్ఎంబీ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించి, కళాశాల అన్ని విభాగాలు, వసతులు, నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. వైద్య విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా వైద్య కళాశాల అభివృద్ధి అంటే విద్యార్థుల సమగ్ర అభివృద్ధి అని,వారికి సౌకర్యవంతమైన వసతి, పరిశుభ్రమైన ఆవరణ, ఉత్తమ విద్యా వాతావరణం, ఆధునిక పరికరాలు అందుబాటులో ఉండాలి అన్నారు. వైద్య విద్యార్థుల భవిష్యత్తు దేశ ఆరోగ్య రక్షణకు పునాది అవుతుంది కాబట్టి కళాశాల అభివృద్ధిని ప్రాధాన్యం గా తీసుకోవాలి అని ఆయన అన్నారు. వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు సులభంగా కళాశాలకు చేరుకునేలా బస్సు ఏర్పాటుకు ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసి బస్సు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్య విద్యార్థులకు మెరుగైన బోధన వాతావరణం కల్పించేందుకు ల్యాబ్లు, లెక్చరర్ గ్యాలరీ, క్లాస్లూములు, లైబ్రరీ వంటి కళాశాల విద్యార్థులకు మెరుగైన బోధన, అందించేందుకు అవసరమైన మౌలిక వసతులపై పూర్తి నివేదికను సమర్పించాలని తెలిపారు.









