మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కేసీఆర్

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్/ భారత ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లులపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 

_బుధవారం ఎర్రవెల్లి నివాసంలో పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయిన ఆయన.. జాతీయ రాజకీయాల్లో రాబోయే మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్రానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు._

 

మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు

 

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని కేసీఆర్ ప్రకటించారు. “మేము అధికారంలో ఉన్నప్పుడే అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ల కోసం తీర్మానం చేశాం. ఈ బిల్లుకు రాజ్యసభలో మా ఎంపీలు మద్దతు ఇస్తారు” అని ఆయన స్పష్టం చేశారు.

 

డీలిమిటేషన్‌పై ‘దక్షిణాది’ ఆందోళన

 

నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఉంటే దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24% ఎంపీ సీట్లు ఉన్నాయని, భవిష్యత్తులో సీట్లు పెంచినా ఈ శాతం తగ్గకుండా చూడాలని డిమాండ్ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బిల్లులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని, అంతవరకు తొందరపడవద్దని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు.

 

పార్టీ కార్యక్రమాలపై చర్చ..

 

రాజకీయ అంశాలతో పాటు పార్టీ సంస్థాగత కార్యక్రమాలపై కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ, అలాగే ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కేటీఆర్, హరీష్ రావులను ఆదేశించారు.

 

దేశంలో భారీగా పెరగనున్న లోక్‌సభ స్థానాలు

Facebook
WhatsApp
Twitter
Telegram