పనివాళ్లుగా చేరి.. కోట్లు దోచేస్తున్నారు..

జూబ్లీహిల్స్ ప్రాంతంలో వరుస హత్యలు, దోపిడీలతో భయాందోళనలు

పని మనుషులుగా చేరి నేరాలకు పాల్పడుతున్న నేపాలీ ముఠాలు

ఈ దోపిడీల వెనుక నేపాల్ నుంచి పనిచేస్తున్న మాస్టర్ మైండ్

నిందితుల కోసం ‘ఆపరేషన్ నేపాల్’కు సిద్ధమైన నగర పోలీసులు

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్/ హైదరాబాద్‌లోని సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్, నందగిరి హిల్స్ ప్రాంతాలు ఇప్పుడు భయంతో వణికిపోతున్నాయి. పని మనుషుల రూపంలో ఇంట్లోకి వస్తున్న కొందరు నేపాలీలు విశ్వాసానికి వెన్నుపోటు పొడుస్తూ హత్యలు, దోపిడీలకు పాల్పడుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గడిచిన మూడు నెలల్లో జరిగిన మూడు ప్రధాన ఘటనలు ఈ ముఠాల క్రూరత్వానికి అద్దం పడుతున్నాయి.

 

వరుస ఘటనలతో కలకలం

ఫిబ్రవరి 6న నందగిరి హిల్స్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో భూపిందర్ షా అనే నేపాలీ యువకుడు.. మిగతా పనివారికి మత్తుమందు ఇచ్చి దాదాపు రూ. 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. మార్చి 14న జూబ్లీహిల్స్‌లో మరో వ్యాపారి ఇంట్లో చేరిన ఇద్దరు నేపాలీలు, యజమాని లేని సమయంలో లాకర్లు పగలగొట్టి రూ. 3 కోట్ల విలువైన నగలను దోచుకెళ్లారు. తాజాగా, మే 8న విశ్రాంత ఐపీఎస్ అధికారి ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ యువతి యజమాని భార్యను హత్య చేసి నగదు, నగలతో ఉడాయించడం పెను సంచలనం సృష్టించింది. ఈ వరుస ఘటనల వెనుక ఒకే ముఠా పనితీరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

 

పక్కా ప్లాన్‌తో దోపిడీ

ఈ ముఠాల పనితీరు చాలా పక్కాగా ఉంటోంది. ముందుగా ధనవంతుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పనివాళ్లుగా చేరుతున్నారు. కొన్ని వారాల పాటు నమ్మకంగా పనిచేస్తూ ఇంట్లోని పరిస్థితులు, నగదు, నగలు ఎక్కడ దాస్తారనే విషయాలపై పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. యజమానులు ఊరికి వెళ్లినప్పుడు లేదా ఏమరపాటుగా ఉన్నప్పుడు రెక్కీ నిర్వహించి, తమ అనుచరులతో కలిసి దోపిడీలకు పాల్పడుతున్నారు. జరిగిన మూడు ఘటనల్లోనూ నిందితులు ఇదే పద్ధతిని అనుసరించినట్లు స్పష్టమవుతోంది.

 

నేపాల్ నుంచి ఆపరేషన్

ఈ కేసుల్లో అరెస్టయిన నిందితులను విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దోపిడీల వెనుక నేపాల్‌లో ఉన్న కొందరు మాస్టర్ మైండ్‌లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పనికి వెళ్లేవారిని ఎంపిక చేయడం దగ్గర నుంచి, దోపిడీ తర్వాత పోలీసులకు చిక్కకుండా ఎలా పారిపోవాలో కూడా వారే సూచనలు ఇస్తున్నట్లు తేలింది. దోచుకున్న సొత్తుతో పట్టుబడకుండా ఉండేందుకు పుణె, ముంబై నగరాలను షెల్టర్ జోన్లుగా వాడుకుంటున్నారు.

 

పోలీసులకు కొత్త సవాల్

గతంలో నగర పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన రాజస్థాన్‌కు చెందిన ‘ముఖియా గ్యాంగ్’ తరహాలోనే ఇప్పుడు ఈ నేపాలీ ముఠాలు సవాల్ విసురుతున్నాయి. అయితే, నేపాలీ గ్యాంగ్ వ్యవహారం అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉండటంతో పోలీసులకు మరింత కష్టంగా మారింది. నిందితులు నేపాల్‌కు పారిపోతే వారిని తిరిగి తీసుకురావడం ఒప్పందాల కారణంగా జటిలమవుతోంది. అయినప్పటికీ, ఈ ముఠాలను పట్టుకునేందుకు నగర పోలీసులు ‘ఆపరేషన్ నేపాల్’ పేరుతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నారు. గత కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram