గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ / అల్లుడిపై మోజులో పడి ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించాలని చూసింది. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.
హత్యకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన అమ్మపల్లి యాదయ్య, అలివేలు దంపతులు. వీరి కూతురిని ఆంజనేయులు అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే, ఇంటికి అల్లుడిగా వచ్చిన ఆంజనేయులతో అత్త అలివేలుకు వరుస తప్పిన వివాహేతర సంబంధం ఏర్పడింది. కూతురి జీవితాన్ని నాశనం చేస్తూ, అల్లుడితో సాగుతున్న భార్య అక్రమ సంబంధం గురించి భర్త యాదయ్యకు తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యాదయ్య.. భార్య అలివేలును, అల్లుడిని పలుమార్లు హెచ్చరించాడు. ఈ విషయమై ఇంట్లో రోజువారీగా గొడవలు జరుగుతుండేవి. తన సుఖానికి, అక్రమ బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన అలివేలు.. ఎలాగైనా అతడిని వదిలించుకోవాలని క్రూరమైన ప్లాన్ వేసింది.
ఈ నెల 23న యాదయ్య తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భర్త చనిపోగానే అలివేలు ఏమీ తెలియనట్టు నటిస్తూ.. ఆయన అనారోగ్యంతో, గుండెపోటుతో మరణించాడని కుటుంబ సభ్యులను, గ్రామస్తులను నమ్మించింది. అంతా నిజమేనని భావించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలకు ముందు సాంప్రదాయం ప్రకారం శవానికి స్నానం చేయించి, దుస్తులు మారుస్తుండగా యాదయ్య శరీరం, మర్మాంగంపై కొన్ని గాయాలు కనిపించాయి. యాదయ్య మృతిపై అనుమానం రావడంతో ఆయన అన్న కుమారుడు పరశురాములు వెంటనే తిమ్మాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలివేలును తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజం ఒప్పుకోక తప్పలేదు. అల్లుడితో తనకున్న వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడనే కక్షతో.. సమయం చూసి భర్త యాదయ్య మర్మాంగాలపై తీవ్రంగా దాడి చేసి హత్య చేసినట్లు అలివేలు అంగీకరించింది. యాదయ్య మరణించిన రోజే ఆయన కూతురు, అల్లుడు ఆంజనేయులు కూడా ఆవంచ గ్రామంలోని వారి ఇంటికి వచ్చి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ హత్యలో అల్లుడి పాత్రతో పాటు కూతురి ప్రమేయం కూడా ఉందేమోనని మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితురాలైన భార్య అలివేలును అరెస్ట్ చేసి, ఈ దారుణంలో అల్లుడు ఆంజనేయుల హస్తం ఎంతవరకు ఉందనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధం కోసం కట్టుకున్న భర్తను కాటికి పంపిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.








