అన్నం పెట్టిన సంస్థకే కన్నం పెట్టిన ఘనులు
బతికున్నవారిని ‘చనిపోయినవారిగా’ చూపించి ₹1.52 కోట్లు స్వాహా!
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో సంచలన మోసం వెలుగులోకి వచ్చింది. వారు పనిచేస్తున్న బీమా సంస్థకే ఇద్దరు ఏజెంట్లు కన్నం వేసినట్లు పోలీసులు వెల్లడించారు.
వెంకటేశ్వర్లు, సరస్వతి అనే ఎల్ఐసీ ఏజెంట్లు మండలంలోని కొంతమంది వ్యక్తుల పేర్లపై పాలసీలు తీసుకుని, వారి బంధువులను నామినీలుగా నమోదు చేశారు. ప్రీమియంలను వారే చెల్లిస్తూ కొంతకాలం తర్వాత పాలసీదారులు మృతి చెందినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు.
ఇలా 39 మంది జీవించి ఉన్నప్పటికీ ‘మరణించారు’ అని చూపిస్తూ డెత్ క్లెయిమ్లు సమర్పించి సుమారు ₹1.52 కోట్లు తమ ఖాతాల్లో జమ చేసుకున్నట్లు వెల్లడైంది.
ఒకే ప్రాంతానికి చెందిన డెత్ క్లెయిమ్లు అధికంగా రావడంతో ఎన్ఐసీ అధికారులకు అనుమానం వచ్చి కమిటీతో విచారణ చేపట్టారు. దీంతో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి — డెత్ క్లెయిమ్ పొందిన వారంతా సజీవంగానే ఉన్నారు!
భద్రాచలం ఎల్ఐసీ బ్రాంచ్ మేనేజర్ చక్రవర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఐదేళ్లు వరుసగా ప్రీమియం చెల్లించిన పాలసీలపై సాధారణంగా ప్రత్యేక విచారణ లేకుండా డెత్ క్లెయిమ్ చెల్లించే విధానాన్ని ఈ ఏజెంట్లు దుర్వినియోగం చేసినట్లు సమాచారం.
కొన్ని నెలల క్రితం సారపాక భాస్కర్ నగర్లోనూ ఇలాంటి ఘటన వెలుగుచూసిన విషయం తెలిసిందే.
నమ్మకంపై నిలిచే బీమా వ్యవస్థలో ఇలాంటి మోసాలు వెలుగుచూడటం ఆందోళనకరం.









