ఆగస్టు 3 వరకు ఓటర్లకు మరో అవకాశం
గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్/తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
ఓటర్ల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని SIR గడువును ఆగస్టు 3, 2026 వరకు పొడిగిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం (ECI) ప్రకటించింది. Geographic
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతుండగా, నిర్దేశిత గడువులోగా దరఖాస్తులు పూర్తి చేయలేకపోయిన ఓటర్లకు ఈ నిర్ణయం ఊరటనిచ్చింది. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, పౌరుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకోవాలనుకునే అర్హులైన పౌరులు, చిరునామా మార్పు, పేరు, వయస్సు, ఫోటో వంటి వివరాల్లో సవరణలు చేయించుకోవాల్సిన వారు లేదా ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి ఓటు బదిలీ చేయించుకోవాల్సిన వారు ఆగస్టు 3లోగా సంబంధిత బూత్ లెవల్ అధికారి (BLO) లేదా ఎన్నికల నమోదు అధికారుల (ERO) కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు.
అదేవిధంగా, ఓటర్లు తమ వివరాలను ఓటరు జాబితాలో సరిచూసుకుని, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సవరణకు దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటరు గుర్తింపు కార్డులోని వివరాలు ఆధార్, ఇతర గుర్తింపు పత్రాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని కూడా సూచించారు.
రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితా తయారీ లక్ష్యంగా ఎన్నికల సంఘం ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. అర్హులైన ప్రతి పౌరుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువు ముగిసేలోపు దరఖాస్తులు పూర్తి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.









