గుజరాత్ రాష్ట్రం మోర్బీ జిల్లాలోని బావిలో ఆగకుండా ఎగసిపడుతున్న నీటి మట్టం
గుజరాత్లోని మోర్బీ జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విర్పర్ద గ్రామంలోని ఒక వ్యవసాయ బావిలో నీళ్లు కొన్ని రోజులుగా వాటంతట అవే ఉవ్వెత్తున ఎగసిపడుతూ, అలల మాదిరిగా కదులుతున్నాయి. అయితే, ప్రజలు ఆందోళన చెందుతున్నట్లుగా ఇది భూకంప సంబంధిత చర్య కాదని, భూగర్భంలో జరుగుతున్న సహజ ప్రక్రియ వల్లే ఇలా జరుగుతోందని జిల్లా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
విర్పర్ద గ్రామానికి చెందిన ప్రాంజీవన్ సదరియా అనే రైతు పొలంలో ఈ బావి ఉంది. సుమారు 18 అడుగుల లోతు ఉన్న ఈ బావిని మూడు నెలల క్రితమే తవ్వించారు. ఆగస్టు 2వ తేదీ నుంచి ఈ బావిలోని నీటిలో వింత కదలికలు మొదలయ్యాయి. నీళ్లు నిరంతరం కదులుతూ, కొన్నిసార్లు బావి అంచుల నుంచి బయటకు పొంగిపొర్లాయి. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఆ మార్గంలో ప్రయాణించే వారు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఈ ఘటనపై జిల్లా జియాలజిస్ట్ జే.ఎస్. వాధేర్ స్పందిస్తూ, ఇది భూకంపానికి సంబంధించిన చర్య అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. “ఈ ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా భూగర్భ జలాలు వేగంగా నిండుతున్నాయి. ఈ క్రమంలో రాళ్ల మధ్య ఖాళీ ప్రదేశాలలో చిక్కుకున్న గాలి, నీటి ఒత్తిడికి బయటకు విడుదల కావడం వల్లే బావిలోని నీటిలో ఈ అలజడి ఏర్పడుతోందని ప్రాథమికంగా భావిస్తున్నాం” అని ఆయన వివరించారు.
ఈ ప్రాంతంలో క్రియాశీలక భూపాత రేఖ (ఫాల్ట్ లైన్) ఏదీ లేదని, ఇటీవల జిల్లాలో ఎటువంటి భూ ప్రకంపనలు నమోదు కాలేదని గాంధీనగర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ కూడా ధ్రువీకరించింది.
ఈ విషయంపై మోర్బీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ఖరే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించామని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ కోసం గాంధీనగర్ నుంచి ఒక నిపుణుల బృందం త్వరలో రానుందని ఆయన పేర్కొన్నారు. నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాతే ఈ వింత అలజడికి గల కచ్చితమైన కారణంపై పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.








