భగ్గుమంటున్న నిత్యావసరాలు

భారీగా పెరిగిన వంటనూనెల ధరలు

 

గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్/ సామాన్య ప్రజలకు నిత్యావసరాలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. వీటి ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. బియ్యం, వంట నూనెలు, పప్పులు, కాయగూరలు… ఇలా అన్ని రకాల సరుకుల ధరలూ పెరిగిపోతున్నాయి. ఒకవైపు ద్రవ్యోల్బణం కారణంగా ధరలు పెరుగుతుండగా.. తాజాగా ఎల్ నినో కూడా ధరల పెరుగుదలకు మరో కారణమవుతోంది. నిత్యవసర ధరల పెరుగుదల గత ఏడాదికన్నా ఈ ఏడాది ఇదే రోజుకే గణనీయంగా పెరగటం ఆందోళన కలిగిస్తోంది. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే ఈ పెరుగుదలను స్పష్టంగా చూపిస్తున్నాయి. వంట నూనె ధరలు 30 నుంచి 45 రూపాయల వరకు పెరుగుదల కనిపిస్తోంది. నూనె ధర కొండెక్కి పోవడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మూడు ప్రధాన రకాల నూనెల ధరలూ బాగా పెరిగిపోయాయి. పామ్ ఆయిల్ అయితే ఏకంగా లీటర్ పై 39 రూపాయలు పెరిగిపోయింది. సన్ ఫ్లవర్ నూనె 31 రూపాయలు, వేరుశెనగ నూనె పాతిక రూపాయలు చొప్పున పెరిగిపోయాయి.

 

 

ఘాటెక్కిన మిర్చి

మిర్చి ధర కూడా ఘాటెక్కిస్తోంది. గత ఏడాది కిలో గ్రేడ్ -1 మిర్చి 178 రూయయల వరకు ఉండగా ఈ ఏడాది ఏకంగా 283 రూపాయలు దాటిపోయింది. ఇక గ్రేడ్-2 మిర్చి ధర 155 రూపాయలు ఉండగా ఈ ఏడాది 254 రూపాయలకు చేరిపోయింది.

 

బియ్యం ధరకూ రెక్కలు

 

బియ్యం ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇవి ప్రభుత్వం చెబుతున్న దానికన్నా బయట ఇంకా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ గణాంకాల మేరకు గ్రేడ్-1 బియ్యం ధర గతేడాది 60 రూపాయల వరకు ఉండగా ఈ ఏడాది 65 రూపాయల వరకు చేరింది. అయితే కొన్ని దుకాణాల్లో పెరుగుదల 10 నుంచి 15 రూపాయల వరకు ఉన్నట్టు సమాచారం,ఉల్లి కూడా కిలోకు తొమ్మిది రూపాయల వరకు పెరిగిపోయింది. మరికొన్ని ఇతర నిత్యావసరాల పరిస్థితి కూడా ఇలాగే ఉన్నట్టు స్పష్టమవుతోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram