బీఆర్ఎస్ తో పొత్తుపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు..!!

పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని.. మార్పును కోరుకుంటే బీజేపీని ఆదరించాలంటూ అమిత్ షా కోరారు. తెలంగాణలో మార్పు అన్నది బీజేపీ ద్వారానే సాధ్యమన్నారు. అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను ఎత్తివేస్తామన్నారు. బీజేపీకి అవకాశమిస్తే వరి పంటకు వెయ్యి రూపాయల బోనస్ ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు.

 

మత రిజర్వేషన్లకు వ్యతిరేకం : మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి రాగానే 4శాతం ముస్లిం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. బీజేపీకి అవకాశమిస్తే వరి పంటకు వెయ్యి రూపాయల బోనస్ ఇస్తామన్నారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా అమిత్ షా మార్చారు.

 

గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరటం ఖాయమని అమిత్ షా అన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గిస్తూ.. మొదట కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కేసీఆర్ హాయాంలో యువత సహా.. అన్ని వర్గాలు నిరాశలో ఉన్నాయని అమిత్ షా పేర్కొన్నారు. పాస్‌పోర్ట్, మియాపూర్ భూములు, ఔటర్ రింగ్ రోడ్, గ్రానైట్, మనీ లాండరింగ్.. కేసీఆర్ సర్కార్ అవినీతి మయమయ్యాయని ఆరోపించారు.

 

వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం : ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రెండు దశాబ్దాలుగా మాదిగ సామాజికవర్గానికి అన్యాయం జరుగుతోందని అమిత్ షా పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను వేగవంతం చేయటం కోసం కేంద్ర కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇంట్లో కూర్చుని ప్రభుత్వాన్ని నడిపేవారికి పరిపాలన ఏం తెలుసని ప్రశ్నించారు. ఫాంహౌస్‌లో కాదు‌ .. ముఖ్యమంత్రి సచివాలయంలో ఉండాలన్నారు.

 

బీజేపీ అధికారంలోకి రాగానే విచారణ జరిపి అవినీతి పరులను జైలుకు పంపుతామని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ప్రస్తుత పథకాలను కొనసాగిస్తామన్నారు. ఎంఐఎం వలనే కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించటం లేదన్నారు. కేంద్ర నిధులపై తెలంగాణ సీఎం కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు.

 

బీఆర్ఎస్ తో పొత్తుపై : బిఆర్ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పొత్తు ఉండబోదని అమిత్ షా స్పష్టంచేశారు. రాజకీయంగా కానీ సిద్ధాంతపరంగా కానీ పొత్తు ఉండదన్నారు.దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ చేసిందని అమిత్ షా పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితబంధు పథకాలు వస్తున్నాయని అమిత్‌షా తెలిపారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ మాట తప్పారన్నారు. రూ.3,116 నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని అమిత్ షా ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు. యువత, దళితులు, వెనుకబడిన వర్గాలు చాలా అసంతృప్తిగా ఉన్నాయని వివరించారు. బీజేపీకి బంపర్ మెజారిటీ ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కోరారు.

Facebook
WhatsApp
Twitter
Telegram