గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాధపాలెం గ్రామపంచాయతీలో రూ. 20 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని, చిమళ్ల, తాటిగూడెం, వెంకటాపురం, వట్టం వారి గుంపు గ్రామాల్లో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
పంచాయితీ కార్యాలయం కోసం స్థలాన్ని దానంగా ఇచ్చిన గ్రామస్తులను ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానించారు. అనంతరం పంచాయితీ అభివృద్ధి పనులపై శాఖల వారీగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరుతున్నాయా లేదా అన్న అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. త్రాగునీరు, విద్యుత్, సాగు, విద్య, వైద్యం వంటి అత్యవసర అంశాలపై అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి తనవంతుగా తనవంతుగా ఇండ్లు మంజూరు చేయిస్తానన్నారు . ప్రజలకు ఇబ్బంది పడకుండా ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
స్థానికులు వివిధ సమస్యలపై వినతిపత్రాలు ఎమ్మెల్యేకు ఇవ్వగా, వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం తాసిల్దార్ నాగప్రసాద్, ఎంపీడీవో కుమార్, వివిధ శాఖల అధికారులు, కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ హుసేన్, టిపిసిసి సభ్యులు చందా సంతోష్ కుమార్, మాజీ సర్పంచ్ పోలెబోయిన శ్రీవాణి, మండల నాయకులు ఎర్ర సురేష్, మహిళా నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









