2-5 తరగతుల పిల్లలకు యాప్‌ ద్వారా పరీక్ష

దేశంలోనే తొలిసారి నిర్వహణ

అభ్యసన సామర్థ్యాల పరిశీలనకు..

యాప్‌లో ప్రశ్నలు చదివి జవాబులు నమోదు చేస్తున్న చిన్నారి

గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్/ తరగతులకు తగినట్లుగా అభ్యసన సామర్థ్యాలను పెంచాలన్న లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 11.90 లక్షల మంది విద్యార్థులకు మొబైల్‌ యాప్‌ ద్వారా బేస్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహిస్తోంది. ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్‌) కార్యక్రమంలో భాగంగా రెండు నుంచి ఐదు తరగతుల విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. ఈ పరీక్షలు బుధవారం ప్రారంభంకాగా.. ఈ నెల 29 వరకు అన్ని జిల్లాల్లో జరగనున్నాయి.

 

పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడ్డాయో లేదో తెలుసుకునేందుకు విద్యా సంవత్సరం మొత్తం మీద మూడు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రారంభంలో పిల్లల పరిస్థితి అంచనా వేసేందుకు బేస్‌లైన్‌ టెస్ట్, నవంబరులో మిడ్‌లైన్‌ టెస్ట్, విద్యా సంవత్సరం ముగిసే ముందు మార్చిలో ఎండ్‌లైన్‌ టెస్ట్‌ జరుపుతారు. ఒక తరగతిలోకి ప్రవేశించడానికి కనీస విద్యా సామర్థ్యాలు ఉన్నాయో? లేవో? వాటి ద్వారా తెలుసుకుంటారు. బేస్‌లైన్‌ టెస్ట్‌ బుధవారం హైదరాబాద్‌ జిల్లాలో మొదలైంది. గతంలో పెన్ను, పేపర్‌ విధానంలో జరపగా.. ఆ ఫలితాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి తీవ్రంగా ఆలస్యమయ్యేది. ఈ నేపథ్యంలో తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ యాప్‌లో కొత్త మాడ్యుల్‌ను చేర్చి దాని ద్వారా పరీక్షలు జరుపుతున్నారు. ఇలా యాప్‌ ద్వారా పరీక్షలు జరపడం దేశంలో ఇదే తొలిసారని ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు తెలిపారు. ప్రశ్నపత్రాలను ఎస్‌సీఈఆర్‌టీ రూపొందించింది.

 

టీచర్లు ఒక్కో విద్యార్థిని పిలిచి.. ఫోన్‌లో తెలుగు, ఆంగ్లం, గణితం ప్రశ్నలను చూపిస్తారు. ఒక్కో విద్యార్థికి గంట సమయం ఇస్తారు. ఆంగ్ల పదాలు సరిగా చదవడం, ఒక చిత్రం ఇచ్చి దాని ద్వారా ఐదు పదాలు రాయడం, నిమిషంలో 25 ఆంగ్ల పదాలను ధారాళంగా చదవడం, వాక్యాలు చదవడం లాంటివి ఉంటాయి. ఇలా తరగతిని బట్టి ప్రశ్నలిస్తారు. విద్యార్థులు వాటికి సమాధానాలు చెబితే టీచర్లు యాప్‌లో నమోదు చేస్తారు. ‘ప్రతి జిల్లాలో రెండు రోజులపాటు నిర్వహిస్తారు. ఆ రెండు రోజుల్లో రాని విద్యార్థులకు అదే పాఠశాలలో మరో రోజు జరుపుతాం’ అని ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకుడు జి.రమేష్‌ తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా నిర్వహిస్తామని, దాన్ని వచ్చే నెలలో జరపాలని భావిస్తున్నామన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram