రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్
గోల్డెన్ న్యూస్// కరకగూడెం//లోక్సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారిని ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. అలాంటి హక్కును కాలరాస్తూ ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నమేనని విమర్శించారు.
దేశంలోని యువత, విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు మరియు సామాన్య ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న రాహుల్ గాంధీపై ఇటువంటి చర్యలు చేపట్టడం ద్వారా ప్రజల గొంతును ఎవరూ మూయలేరని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు ధోరణిని విడనాడి, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని, ప్రతిపక్ష నాయకులపై వేధింపులు, అక్రమ అరెస్టులు వంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో విభిన్న అభిప్రాయాలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రజల స్వేచ్ఛా హక్కులను హరించే చర్యలు దేశ ప్రజాస్వామ్యానికి హానికరమని ఆయన పేర్కొన్నారు.









