గోల్డెన్ న్యూస్/మహబూబ్నగర్/ మహబూబ్నగర్ జిల్లా సహాయ సంచాలకుడు (సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్) కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న బొమ్మిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి రూ.15 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కాడు.
కర్వేన గ్రామానికి సంబంధించిన గ్రామ మ్యాప్లో సవరణలు చేపట్టేందుకు ఫైల్ను సహాయ సంచాలకుడి వద్దకు పంపించి అధికారిక అనుకూలత కల్పించేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.15 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా మహబూబ్నగర్ రేంజ్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి రూ.15 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు అతడిని అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ వెల్లడించింది.








